నా కెప్టెన్సీ నాదే.. ఎవరి నీడలోనూ ఉండను: శ్రేయస్ అయ్యర్

  • భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామ‌కం
  • ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో అతడి సార‌థ్యంలోనే బ‌రిలోకి దిగ‌నున్న టీమిండియా
  • కెప్టెన్సీ ఒక సవాలని, దానికోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోనని శ్రేయస్ స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • తాను వేరొకరిలా ఉండటం గానీ, ఎవరి నీడలో ఉండటం గానీ ఇష్టపడనని వెల్ల‌డి
భారత టీ20 క్రికెట్ జట్టులో కొత్త శకం ప్రారంభమైంది. నిలకడైన ప్రదర్శనతో పాటు ఐపీఎల్‌లో నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ కీలక బాధ్యతలు అప్పగించింది. టీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా అతడిని ఎంపిక చేసింది. త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు శ్రేయస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ స్థానంలో ఈ మార్పు చోటుచేసుకుంది.

గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. 2023 డిసెంబర్‌లో చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడిన అతడిని, ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచ కప్ 2025, ఆసియా కప్‌లకు సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ రెండు టోర్నమెంట్లలో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించాడు. అయితే, జాతీయ జట్టులో అవకాశం రాకపోయినా, శ్రేయస్ ఐపీఎల్‌లో తన నాయకత్వ పటిమను చాటాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడమే కాకుండా 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఇదే సమయంలో సూర్యకుమార్ ప్రదర్శన అత్యంత పేలవ స్థాయికి పడిపోవడంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శ్రేయస్ వైపు మొగ్గు చూపింది.

ఈ నియామకంపై ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. "కెప్టెన్‌గా నాకు లభించిన ఈ బాధ్యత పెద్ద‌ సవాల్. ఈ బాధ్యత కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను గతంలో ఎలా ఉన్నానో, ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. మరొకరిలా మారడానికి ప్రయత్నించను. ఎవరి నీడలోనూ ఉండాలనుకోవడం లేదు" అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. కెప్టెన్సీ సవాలును స్వీకరిస్తూనే, తన సహజ శైలిలోనే జట్టును ముందుకు నడిపిస్తానని శ్రేయస్ ధీమా వ్యక్తం చేశాడు. అతని మాటలు నాయకుడిగా తనపై తనకు ఉన్న స్పష్టతను తెలియజేస్తున్నాయి.

Shreyas Iyer
India T20 Captain
BCCI
Suryakumar Yadav
India tour of Ireland England
IPL Captaincy

More Telugu News